ఏపీలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు

ఏపీలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు

ఏపీలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు

నైరుతి ఋతుపవనాలు బుధవారం నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరించాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలు నేపధ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దీనిపై ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశామన్నారు. నదీ తీరాలు, సరస్సులు, చెరువులు, కాలువల్లో మునిగిపోయే కేసులను (Drowning Cases) తగ్గించడానికి, ప్రమాదాన్ని కలిగించే నీటి వనరులు, ఆయా ప్రాంతాలను తక్షణం గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశామన్నారు.

ఈ హెచ్చరిక బోర్డుల్లో భద్రతా సూచనలు, సహయం కోసం అత్యవసర నెంబర్ల సమాచారం ఉంచాలని తెలిపారు. బుధవారం సాయంత్రం 5గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 31.5మిమీ, రాజాపురంలో 27.7మిమీ, పలాసలో 24.5మిమీ, హరిపురంలో 24.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 152.4మిమీ, టెక్కలిలో 139.4మిమీ, కోటబొమ్మాళిలో 117మిమీ, ఏలూరు జిల్లా వేలేరుపాడు 89మిమీ, బుట్టాయగూడెంలో 84.4మిమీ అధిక వర్షపాతం రికార్డైందన్నారు.